11 మందిని చంపిన సీరియ‌ల్‌ కిల్ల‌ర్ అరెస్ట్

సీరియల్‌ కిల్లర్‌ సత్యం యాదవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగు రాష్టాల్ల్రో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్‌పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. నిజానికి సత్యం యాదవ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వివిధి పోలీసు స్టేషన్లలో 12 నుంచి 16 కేసులు ఉన్నాయని.. 20 మందికి పైగా ఇతని చేతిలో బలి అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం తాంత్రికుడు సత్యం యాదవ్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్‌ డీఐజీ చౌహన్‌ విూడియాకు వివరించారు. ఇప్పటి వరకు 11 హత్యలకు సంబంధించి సత్యం యాదవ్‌ ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసు కస్టడీలోకి తీసుకుని మరిన్ని కేసులపై విచారణ జరుపుతామని డీఐజీ చౌహాన్‌ వెల్లడించారు. జిల్లాలో నరహంతకుడి ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సత్యం యాదవ్‌ అనే వ్యక్తి ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని తాంత్రిక పూజలతో సంఘంలో పెద్దమనిషిగా చలామణి అయ్యాడు. ఆ ఆసరాతోనే అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని ఓ పార్టీలో నాయకుడిగా మారాడు. ఇక తనకు ఎదురు ఉండదని భావించి అరాచకాలు మొదలుపెట్టాడు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యలో అతడి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూలు జిల్లాలోనే కాకుండా హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ పలు దురాగతాలకు పాల్పడినట్లు వారి దృష్టికి వచ్చింది. అతడి పాపాలతో కొన్నింటిని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. తాంత్రికుడు సత్యం యాదవ్‌ వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్‌పూర్‌ గ్రామంలో 2020 ఆగష్టు 14న గుప్తనిధుల తవ్వకాల కోసం ఒకే ఇంట్లో నలుగురిని హతమార్చిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. గన్యాగుల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షల విలువైన ప్లాట్లను రాయించుకున్నాడు. అయితే ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు గొడవ చేయడంతో అతడిని హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనూ సత్యం యాదవ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలోనూ, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్‌ కేసులోనూ సత్యం యాదవ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇవి మచ్చుక కొన్ని మాత్రమే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

వేర్వేరు ప్రమాదాల్లో టాటా ఏస్‌ దగ్ధం పొలాల్లోకి దూసుకు పోయిన ఆర్టీసీ బస్సు

యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత….

కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మంత్రి ఉత్త‌మ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *