చైనాపై బాంబ్ పేల్చిన జోబైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనా ఆర్థిక వ్యవస్థపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనాభా, ఆర్థిక సమస్యలు చైనా ను పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబులా మార్చేశాయని అన్నారు. చైనా పరిస్థితి.. మిగిలిన ప్రపంచాన్ని భయపెడుతోందని వివ‌రించారు. యూటాలోని పార్క్‌సిటీలో ఫండ్‌ రెయిజింగ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సందర్భంగా బైడెన్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలో వృద్ధి మందగించిందన్నారు. చైనాలో పనిచేసేవారి కంటే రిటైరైపోయేవారి సంఖ్యే అధికంగా ఉండ‌డం సమస్యాత్మకంగా మారిందని చెప్పారు. సాధారణంగా చెడ్డవారికి సమస్యలుంటే.. వారు మరింత చెడు పనులే చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు చైనాపై బైడెన్‌ చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు ఇవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా ఎగుమతులు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులను అమెరికా నిలిపివేసింది. బీజింగ్‌ చర్యలను వాషింగ్టన్‌ జాగ్రత్తగా గమనిస్తోందని.. దాంతో పోరును కోరుకోవడంలేదని బైడెన్‌ వెల్లడించారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును ఆయన ఓ రుణ ఉచ్చుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కింద రుణం పొందాలనుకునే దేశాలు చైనా షరతులను కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందన్నారు. అమెరికా సంస్థలు చైనాలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు విధిస్తూ ఈ వారం బైడెన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చైనాతో సంబంధాలను కొంత మెరుగుపర్చుకొనేందుకు విఫల యత్నం చేసిన తర్వాతే ఈ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *