వేములవాడలో దొంగల ముఠా గుట్టురట్టు.. చోరీల నియంత్రణపై పోలీసుల ఉక్కుపాదం!

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో దొంగతనాలు, నేరాల నియంత్రణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న   దొంగల ముఠాలపై వేములవాడ పోలీసులు విరుచుకుపడుతున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో, పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మరో కీలక చోరీల ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల ఛేదన

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా కొన్ని దొంగతనాలు జరిగాయి. ఈ కేసులను సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ఆధారాల సేకరణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (సిసిటివి ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ) ఉపయోగించారు. నిందితులను వేగంగా గుర్తించి గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:

  • ఆడెపు రవి అలియాస్ చోరు రవి

  • గాజులవేణి అరుణ్ కుమార్

  • కృష్ణ

  • గాజుల హేమంత్

పగటి పూట మరియు రాత్రి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయాన్ని నిశితంగా గమనించి వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

సర్వత్రా ప్రశంసలు.. నేరస్థుల్లో వణుకు!

శాంతిభద్రతల పరిరక్షణలో వేములవాడ పోలీసులు రాజీలేని వైఖరిని అవలంబిస్తున్నారు. కేవలం దొంగతనాలు మాత్రమే కాకుండా.. అక్రమ ఇసుక రవాణా, గంజాయి స్మగ్లింగ్, హత్య కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వరుసగా కేసులను ఛేదిస్తూ నిందితులను కటకటాల్లోకి నెడుతుండటంతో నేరగాళ్లలో వణుకు మొదలైంది. పోలీసుల శైలిపై స్థానిక ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలకు డీఎస్పీ శ్రీనివాసులు కీలక సూచనలు:

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..  ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు:

  • భద్రతా చర్యలు ముఖ్యం: ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో నాణ్యమైన తాళాలను ఉపయోగించాల‌న్నారు. వీలైతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల‌ని చెప్పారు.

  • పొరుగువారికి సమాచారం: ఎక్కువ రోజుల పాటు ఊరికి వెళ్లాల్సి వస్తే సమీప బంధువులకు లేదా నమ్మకమైన పొరుగువారికి సమాచారం అందించి వెళ్లాల‌న్నారు.

  • పోలీసులకు అలర్ట్: కాలనీల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాల‌న్నారు.

“ప్రజల సహకారం, పోలీసుల అప్రమత్తత తోడైతే నేర రహిత సమాజాన్ని నిర్మించడం సులువవుతుంది” అని డీఎస్పీ స్పష్టం చేశారు.

also read

అనుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృ*తి!

రైతులకు గుడ్ న్యూస్: ఇకపై ‘మీసేవ’ కేంద్రాల్లోనే యూరియా బుకింగ్.. ఎలాగో తెలుసుకోండి!

ఆ చార్జీలు ర‌ద్దు.. సామాన్యుడికి ఊర‌ట‌.. బ్యాంకుల‌కు రూ. కోట్ల న‌ష్టం