ఇన్నాళ్లు నీడనిచ్చిన ఇల్లే ఇయ్యాల ఆయువు తీసింది. రాత్రి తిని పడుకున్న ముగ్గరు వ్యక్తలపై ఇంటి గోడ కూలడంతో అసువులు బాశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన దంపతులు శీలం రాములు(90), రాములమ్మ (70) వీళ్ల కుమారుడు శ్రీను (35) బుధవారం రాత్రి తిని పడుకున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు గోడ పూర్తిగా శిథిలమైపోయింది. బుధవారం రాత్రి అది వారిపై విరిగి పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీళ్ల ఇల్లు మిగితా ఇండ్లకు కొంత దూరం ఉండడంతో ఊరి వాళ్లు గమనించలేదు. గురువారం సాయంత్రం కరెంటు బిల్లుల రీడింగ్ వెళ్లిన విద్యుత్ సిబ్బంది గమనించి పోలీసులకు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
