Gold Price” న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 (RNA):
దేశవ్యాప్తంగా బంగారం ధరలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో, ధరలు రోజురోజుకీ కొత్త గరిష్ఠాలను అధిగమిస్తున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతూ వచ్చిన 24 క్యారెట్ల బంగారం ధర, తాజాగా 10 గ్రాములకు ₹1,06,970కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ₹98,050గా నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే 24 క్యారెట్లకు ₹880, 22 క్యారెట్లకు ₹800 వరకూ పెరగడం విశేషం.
గత వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు సుమారు ₹5,000 దాకా పెరగడం వినియోగదారుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత రేటు కొనసాగితే, బంగారం త్వరలోనే ₹1,10,000 మార్కును తాకే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ధరలు పెరిగిన దిశగానే
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ దేశవ్యాప్తంగా ఉన్న ధరలే నమోదవుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర ₹1,06,970గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹98,050గా ఉంది.
ఢిల్లీ మార్కెట్లో రేట్లు మరింత ఎక్కువగా
దేశ రాజధానిలో బంగారం ధరలు మరింత అధికంగా నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹1,07,120కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹98,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
వినియోగదారుల్లో ఆందోళన
ధరల ఈ విపరీత పెరుగుదల పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలను ఆలోచనలో పడేసింది. “దీపావళికి ముందు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియట్లేదు” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
వెండి ధర కూడా పెరుగుతూనే…
బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. బుధవారం నాటికి కిలో వెంది ధర ₹900 పెరిగి ₹1,27,000కు చేరింది. హైదరాబాద్లో అయితే అదే కిలో వెండి ₹1,37,000కు చేరింది.
ఈ ధరలు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ఆధారంగా బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదు అయ్యినవే. ప్రాంతాన్ని బట్టి కొన్ని తేడాలు ఉండే అవకాశం ఉంది.
