టెహ్రాన్/జెరూసలేం: ఆధునిక యుద్ధ తంత్రంలో సాంకేతికత ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి సంబంధించిన తాజా వివరాలు నిరూపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అత్యంత పకడ్బందీగా, ఏళ్ల తరబడి ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ను సక్సెస్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఏళ్ల తరబడి నిఘా.. ఏఐతో అల్గారిథమ్స్
ఖమేనీ కదలికలను కనిపెట్టడానికి ఇజ్రాయెల్ కేవలం మానవ వనరులనే కాకుండా, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఖమేనీ ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడ నివసిస్తున్నారు? ఆయన కమ్యూనికేషన్ పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై నిరంతర నిఘా ఉంచారు. సేకరించిన భారీ డేటాను విశ్లేషించడానికి ప్రత్యేకమైన అల్గారిథమ్స్ను వాడి, ఆయన తదుపరి అడుగును ముందే ఊహించగలిగినట్టు తెలుస్తోంది..
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్
ఈ ఆపరేషన్లో అత్యంత విస్మయకరమైన విషయం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ను ఇజ్రాయెల్ హ్యాక్ చేయడం. ఏళ్ల తరబడి ఇరాన్ భద్రతా కెమెరాలు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయని సమాచారం.
-
టెహ్రాన్లోని పెస్టర్ స్ట్రీట్ సమీపంలోని ఖమేనీ కాంపౌండ్ కదలికలను నిత్యం పర్యవేక్షించారని ఇరాన్ మీడియా ఆరోపిస్తోంది.
-
భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్, అధికారుల రాకపోకలను ఎప్పటికప్పుడు ఎన్క్రిప్టెడ్ డేటా రూపంలో విశ్లేషించారని పలువురి వాదన.
-
మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకున్నారని కొందరి వాదన.
ఆ శనివారమే ఎందుకు?
ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడి వెనుక పక్కా లెక్కలు ఉన్నాయి. ఇరాన్లో శుక్రవారం సెలవు దినం కావడంతో, శనివారం నాడు ఖమేనీ తన అధికారిక నివాసంలో సైనిక, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమయాన్ని సరిగ్గా అంచనా వేసిన ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన పక్కా సమాచారంతో ఖచ్చితత్వంతో కూడిన బాంబింగ్కు పాల్పడింది.
సైబర్ దాడులతో ఇరాన్ అప్రమత్తతకు బ్రేక్
భౌతిక దాడులతో పాటు, ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు భారీ స్థాయిలో సైబర్ దాడులు కూడా జరిగాయి.
-
ఇరాన్ భద్రతా వ్యవస్థలు, అధికారిక మీడియా వెబ్సైట్లు హ్యాక్కు గురయ్యాయి.
-
ఇంటర్నెట్ కనెక్టివిటీని నిలిపివేయడం ద్వారా ఇరాన్ ప్రతిదాడులు చేయకుండా కట్టడి చేశారు.
“మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో.. టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు” అని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
