Kesavapatnam Hostel” శంకరపట్నం:
కేశవపట్నం, జూలై 9: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో బుధవారం రోజున ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీకి మండల వైద్యాధికారి డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్ నేతృత్వం వహించారు.
తనిఖీ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార మెనూ గురించి కుక్ను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌష్టికాహారాన్ని అందించడం తప్పనిసరిని స్పష్టంచేశారు. అలాగే, వసతి గృహ పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని సూచించారు.
తనిఖీ సమయంలో వార్డెన్ (వసతి గృహ సంక్షేమ అధికారి) అందుబాటులో లేకపోవడంతో, ఆయనతో ఫోన్లో మాట్లాడి తగిన సూచనలు ఇచ్చినట్టు వైద్యాధికారి వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆహార మెనూ అమలులో ఉండాలని, వసతి గృహ విద్యార్థుల భవిష్యత్ కోసం అవసరమైన అన్ని ఆరోగ్య, శుభ్రత ప్రమాణాలు పాటించాలనే ఆదేశాలిచ్చారు.
ఈ తనిఖీలో ఆయుష్ డాక్టర్ సంధ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, ఇతర వైద్య బృంద సభ్యులు పాల్గొన్నారు.
