బిహార్‌లో పడవబోల్తా.. 10మంది చిన్నారులు గల్లంతు

ముజఫర్‌పుర్ ప‌డ‌వ‌బోల్తాప‌డి 10 మంది చిన్నారులు గ‌ల్లంతయిన ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్ ఫుర్ లో గురువారం చోటు చేసుకుంది. మ‌ధుర‌ప‌ట్టి ఘాట్‌లో స‌మిపంలో భాగ‌మ‌తి న‌దిలో ప‌డవ బోల్తా ప‌డింది. పాఠ‌శాల‌కు వెళ్లే విద్యార్థులు ప‌డ‌వలో వెళ్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌డ‌వ బోల్తా ప‌డిన స‌మ‌యంలో అందులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. విష‌యం తెలుసుకున్న స్థానికులు నాటు ప‌డ‌వ‌ల‌తో న‌దిలోకి వెళ్లి కొంత‌ మంది విద్యార్థుల‌ను ఒడ్డుకు చేర్చారు. మ‌రికొంత మందికి ఈత రావ‌డం వ‌ల్ల వారు ఒడ్డుకు చేరారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గల్లంతైన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు గల్లంతు కావడం వల్ల అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాల కోసం అన్వేషిస్తున్నారు. ముజఫర్‌పుర్‌ పర్యటనలోనే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌.. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *