జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ పిలుపు

కరీంనగర్ |
హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 5 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న రోడ్ సురక్షా అభియాన్ – రహదారి భద్రత ప్రత్యేక అవగాహన కార్యక్రమం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా న్యాయస్థానం నుంచి ఇందిరా గాంధీ కూడలి వరకు బైక్ ర్యాలీ
జిల్లా ప్రధాన న్యాయస్థానం నుంచి ఇందిరా గాంధీ కూడలి వరకు ఈ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణరక్షణ
ర్యాలీ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,
ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మోటారు కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాల్సిందేనని సూచించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపితేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు శాశ్వత అంగవైకల్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి భద్రతపై ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ అవగాహన కార్యక్రమంలో
-
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్
-
జిల్లా రవాణాశాఖ కమిషనర్ పి. పురుషోత్తం
-
ట్రాఫిక్ ఏసీపీ స్వామి
-
కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు
-
జనరల్ సెక్రటరీ కే. అరుణ్ కుమార్
-
డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్
-
సీనియర్, జూనియర్ న్యాయవాదులు
-
రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.

న్యాయసేవాధికార సంస్థ – ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు, ర్యాలీ
గోదావరిఖని
మదర్ న్యూస్ ప్రతినిధి:
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా “అరైవ్ – అలైవ్” కార్యక్రమం కింద భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత సమాజం నిర్మాణం, ప్రమాదాల వల్ల మరణాలను నియంత్రించాలనే లక్ష్యంతో మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, న్యాయపరమైన అంశాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం గోదావరిఖని అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథులుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి. శ్రీనివాసరావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హాజరయ్యారు.
ట్రాఫిక్ నియమాల పాటింపుతో ప్రమాదాల నివారణ సాధ్యం
అవగాహన సదస్సులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ,
ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో విద్యార్థులకు వివరించారు.
హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగ ప్రాధాన్యత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడిపితే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల సందర్భంలో బాధితుల హక్కులు, చట్టపరమైన బాధ్యతలపై న్యాయసేవాధికారులు వివరించారు.
కోర్ట్ నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డు భద్రత ర్యాలీ
సదస్సు అనంతరం జడ్జి, పోలీస్ అధికారులు కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
యువతే మార్పుకు దారి చూపాలి : ఏసీపీ రమేష్
ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ,
యుద్ధాల కంటే ఎక్కువ మంది యువకులు నిత్యం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివే ప్రధాన కారణాలన్నారు.
విద్యార్థులు తమ విద్యార్ధి దశ నుంచే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు కూడా అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రత రాయబారులుగా మారి సమాజంలో మార్పుకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో
-
డా. టి. శ్రీనివాసరావు – అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి, గోదావరిఖని
-
ఐ. సురత్ రాజ్ సింగ్ – సెషన్స్ న్యాయమూర్తి
-
ఎన్. వెంకట సచిన్ రెడ్డి – ప్రిన్సిపల్ జడ్జి
-
ధ్రువ వెంకటేష్ – ద్వితీయ అదనపు న్యాయమూర్తి
-
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు
-
గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి
-
ట్రాఫిక్ ఎస్ఐలు హరిశేఖర్, రామరాజు
-
లాయర్లు, కోర్టు సిబ్బంది
-
ప్రభుత్వ, శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడుచేసుకోవద్దు
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు అందరూ కృషి చేయాలి : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
పెద్దపల్లి | మదర్ న్యూస్ ప్రతినిధి:
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకాకుండా చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా “సే నో టు డ్రగ్స్” నినాదంతో గురువారం అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టిటిఎస్ అంతర్గం రామాలయం గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని అంతర్గం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు.
మత్తు పదార్థాలు భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హాజరై మాట్లాడారు.
డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాలని, కష్టపడి చదువుకోవాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారమవుతుందని హెచ్చరించారు.
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
మత్తు పదార్థాల సమాచారాన్ని పోలీసులకు అందించాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డీసీపీ పేర్కొన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రుల ఆనందాన్ని దూరం చేసుకునే ప్రమాదం ఉందన్నారు.
తమ గ్రామాల్లో లేదా పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా నార్కోటిక్ విభాగం 1908 నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై మాట్లాడుతూ, నేటి రోజుల్లో నేరగాళ్లు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్ ఫోన్, ఈమెయిల్కు వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,
తెలియని వెబ్సైట్లలో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పోస్ట్ చేయవద్దని సూచించారు.
గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు, పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు.
పోలీస్ కళాబృందం ప్రత్యేక ప్రదర్శనలు
ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు
రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై
పాటలు, నాటికల రూపంలో ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ అవగాహన కార్యక్రమంలో
-
రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్
-
అంతర్గం ఎస్ఐ వెంకట్
-
సుమారు 300 మంది మండల ప్రజలు
-
యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
