Road Accident” శంకరపట్నం ప్రతినిధి, జూన్ 9 :
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గ్రామస్థులు మరియు 108 సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం – అంబాలాపూర్కు చెందిన సముద్రాల మల్లయ్య, ఎండి రఫీక్ అనే ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత అవసరాల కోసం కేశవపట్నంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో మల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా, రఫీక్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం ఘటన స్థలానికి చేరుకుంది. ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ ఆర్. గౌతమ్ లు మల్లయ్య, రఫీక్ లకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
