జగిత్యాల: ఆ ఇంట్లో విషాదం రెట్టింపయ్యింది. అప్పుల బాధతో కొడుకు బలవన్మరణానికి పాల్పడితే.. ఆ వార్త విన్న కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకు మృతదేహం కళ్లముందే ఉండగానే ఆమె కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది.
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతే గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అనే యువకుడు గత కొంతకాలంగా అప్పుల బాధతో సతమతమవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సంపత్ మృతి చెందాడు.
కొడుకు మరణవార్త విని తల్లి విగతజీవిగా..
పోస్టుమార్టం నిమిత్తం సంపత్ మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లి మల్లవ్వ (60) తల్లడిల్లిపోయింది. కొడుకు మృతదేహంపై పడి ఏడుస్తుండగానే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అక్కడే ఉన్న వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే ఆమె కూడా ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
ఒకే రోజు తల్లి, కొడుకులు మరణించడంతో మోతే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. గుండెపోటుతో తల్లి జగిత్యాల జిల్లాలో మిన్నంటిన రోదనలు..
భక్తులకు ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్: ఒకే యాత్రలో కాశీ, అయోధ్య, పూరి దర్శనం!
