oil palm” ప్రత్యామ్నాయ పంటల్లో ఆయిల్ ఫామ్కు ప్రాధాన్యత ఇవ్వాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మదర్ న్యూస్ ప్రతినిధి:
రైతులు వరి పంటలకే పరిమితమవకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఆయిల్ ఫామ్ సాగు ముఖ్యమైన ప్రత్యామ్నాయ పంటగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
లోహియా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో “బంగారు రైతు” అవగాహన కార్యక్రమం శనివారం కరీంనగర్లోని కె.ఎస్.ఎల్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా మాట్లాడుతూ.. ఒక సీజన్లో వరి సాగు చేసినట్లయితే, మరొక సీజన్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
డిమాండ్ ఉన్నా ఉత్పత్తి తక్కువగా ఉన్న ఆయిల్ ఫామ్ పంట రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ పంటలో అంతర పంటలు కూడా సాగు చేయవచ్చని, మూడు సంవత్సరాల పాటు కష్టపడితే 30 సంవత్సరాల వరకు ఆదాయం అందించే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు నాలుగు సంవత్సరాల పాటు ఎకరానికి ₹51,000 వరకు సబ్సిడీ అందిస్తోందని, ఇందులో బిందు సేద్యం కోసం మాత్రమే ₹22,500 సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం జిల్లాలో 320 మంది రైతులు 1,200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని, ఈ సంవత్సరం దీన్ని 3,000 ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, లోహియా సంస్థ సీఈవో సిద్ధాంత్ లోహియా, ప్రతీక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
