Tdwjf” జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్
-
సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపు
-
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య**
జగిత్యాల, మే 22:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రంలోని జర్నలిస్టులకు అండగా నిలుస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు. పాత్రికేయుల సమస్యలపై సమిష్టిగా పోరాడేందుకు ప్రతి జర్నలిస్టు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
జగిత్యాలలో గురువారం నిర్వహించిన జిల్లా ముఖ్యనేతల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి క్షీణించిందని, ముఖ్యంగా గ్రామీణ విలేకరులు తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“గత ప్రభుత్వం పదేళ్ల పాటు జర్నలిస్టుల సమస్యలను విస్మరించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదే మార్గంలో కాలయాపన చేస్తోంది. ఏడాదిన్నర అయినా ఇప్పటికీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయారు” అని ఆరోపించారు.
జర్నలిస్టులు ధైర్యంగా ముందుకు వచ్చి, ఎవరికి భయపడకుండా సంఘంలో సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. అలాంటి సంఘాల నుండి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
చిన్న, పెద్ద పత్రికల విలేకరులు, యువ జర్నలిస్టులు, ఇతర సంఘాల నుండి పెద్ద ఎత్తున టీడబ్ల్యూజేఎఫ్లో చేరుతున్నారని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించి, రాష్ట్ర మహాసభను విజయవంతంగా నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ద్యావర సంజీవ రాజు, వేములవాడ అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు రేణిగుంట శ్రీనివాస్, రాగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
