శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రకు చెందిన శ్రావణ్, పంచపూల దంపతులు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కేశవపట్నం గ్రామానికి వలస వచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి పక్కనే గుడారం ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబం, ఇనుప సామాను మరియు వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది. వీరికి నలుగురు కుమార్తెలు.
శనివారం సాయంత్రం నాలుగో కుమార్తె నిత్య (3) ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా, జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుండి పరారయ్యాడు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మరణంతో ఆ కుటుంబం గుండెలవిసేలా విలపిస్తోంది. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చిన్నారిని ఢీకొట్టి పరారైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
this also read ..
బాధితుల వద్దకే పోలీస్ సేవలు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ ప్రారంభం
అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. గుండెపోటుతో తల్లి జగిత్యాల జిల్లాలో మిన్నంటిన రోదనలు..
మొర్రాపూర్ తండాలో తీరని విషాదం: కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు.. 10 ఏళ్ల విద్యార్థి మృతి
